| సామాన్యుల చేతిలో వజ్రాయుధం సహచట్టం |
| ప్రచురణ తేది: 01/11/2009 |
|
' ఈనాడు' ముందడుగు సదస్సులో వక్తలు
ఆత్మకూర్ (ఎస్), న్యూస్టుడే: 2005 సమాచార హక్కుచట్టం ప్రయోజనాలకు ప్రజలకు అందించి చట్టం అమలులో పారదర్శకతను చాటుకుంటామని మండల తహసిల్దార్ ఎ.బ్రహ్మచారి అన్నారు. శనివారం ఆత్మకూర్ (ఎస్) ఎంపీడీవో కార్యాలయంలో 'ఈనాడు' ముందడుగు ఆధ్వర్యంలో సహచట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీపీ పున్నమ్మ అధ్యక్షతన వహించిన ఈ అవగాహన సదస్సులో తహసిల్దార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సహ చట్టంతో సామాజిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని వివరించారు. సామాన్యుని చేతితో ఈ చట్టం వజ్రాయుధం వంటిదని పేర్కొన్నారు. ఎండీవో శర్మ మాట్లాడుతూ సమాచారం అనేది ఒక విప్లవం లాంటిదని... మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ శాఖకు వచ్చే నిధులపై వంద శాతం సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వైద్యాధికారి ఎన్.మురళిధర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి అధికారిని సమాచారం అడిగే హక్కు ఉందన్నారు. ఐసీడీఎస్, సీడీపీవో రామరాజ్యం మాట్లాడుతూ సహచట్టాన్ని దుర్వినియోగం చేయవద్దని సూచించారు. 'ఈనాడు' ముందడుగు జిల్లా కో ఆర్డినేటర్ కె.నర్సింహులు మాట్లాడుతూ సహచట్టం ద్వారా సాధించిన విజయాలను, చట్టం ప్రయోజనాలకు వివరించారు. ఉపాధి హామీ ఏపీవో శ్రీరాములు, సర్పంచి వెంకన్న, నీటి సంఘం ఛైర్మన్ యల్లయ్య, ఉప సర్పంచి శ్రీను, తెలుగు యువత మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, సి.పి.ఐ (ఎం) న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటరెడ్డి, దశరథ, చందునాయక్, తదితరులు పాల్గొన్నారు. |
|