|
|
| బడికి చేరిన బాలసాహిత్యం |
| ప్రచురణ తేది: 26/10/2009 |
|
పి ల్లల్లో సృజనాత్మకత.. సాహిత్యాభిలాష పెంపొందించాలన్న ఉన్నత ఆశయానికి తమ నిర్లక్ష్యంతో నాలుగేళ్ల పాటు అధికార యంత్రాంగం గండి కొట్టింది. కథలు.. కవితల్ని విషయ నిపుణులతో చర్చించి తయారుచేసిన 'బాల సాహిత్యం' పుస్తకాలు మరుగున పడ్డ విషయం సహ చట్టంతో వెల్లడైంది. దాంతో అప్పటికప్పుడు ఆ పుస్తకాలను అధికారులు పాఠశాలలకు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 2,623 ప్రాథమిక పాఠశాలల్లో బాలసాహిత్యం పుస్తకాలు పంపిణీ చేయాలని 2004-05 విద్యా సంవత్సరంలో రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిర్ణయించారు. రూ.6 లక్షల నిధులు కేటాయించారు. వీటితో కథల కార్డులు, కథా వాచికలు, ప్రయోగత్మాకంగా కొన్ని పుస్తకాలు తయారుచేశారు. అనంతరం హైదరాబాద్లోని రాజీవ్ విద్యామిషన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు డైరెక్టర్ పరిశీలనకు పంపారు. నాలుగేళ్లు గడిచింది. అక్కడి నుంచి ఏ సమాధానం లేదు. జిల్లా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం మానేశారు. 'ఈనాడు ముందడుగు' స్పందించి సహ చట్టాన్ని వినియోగించింది. పుస్తకాల పంపిణీలో జాప్యానికి కారణాలు తెలపాలని రాజీవ్ విద్యామిషన్ అధికారులకు దరఖాస్తు చేసింది. సమాచారం వచ్చింది. దాన్ని ఆధారంగా 'బడికి చేరని బాలసాహిత్యం' శీర్షికన జిల్లా 'ఈనాడు' పత్రికలో కథనం ప్రచురితమైంది. దాంతో అధికారుల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. నాలుగేళ్లుగా మూలనపడి ఉన్న బాలసాహిత్యం పుస్తకాల్ని ఆగమేఘాల మీద పాఠశాలలకు పంపించారు. ఒకే ఒక్క దరఖాస్తు అధికారుల పెను నిద్దురను వదిలించింది. - ఎం.సురేష్, న్యూస్టుడే, శ్రీకాకుళం |
|