| ఇమ్మన్నా.. ఇవ్వరు! |
| ప్రచురణ తేది: 08/09/2009 |
|
స మాచారం ఇవ్వాలని సాక్షాత్తూ కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించినా పట్టించుకోని అధికారుల ఘనత ఇది. కర్నూలు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (గతంలో ఆర్.జి.బి.) లో జరిగిన రూ.2 లక్షల నిధుల దుర్వినియోగంపై యాజమాన్యం తీసుకున్న చర్యల వివరాలను కోరుతూ కడపకు చెందిన యు.రంగారెడ్డి మే 4, 2007న సహ దరఖాస్తు చేశారు. 'మీరు కోరిన సమాచారంలో ప్రజా ప్రయోజనం లేదు. సెక్షన్ 8(1)(జె) కింద మీ దరఖాస్తును తిరస్కరిస్తున్నాం' అంటూ పీఐవో అయిన బ్యాంకు జీఎం లేఖ పంపారు. దీనిపై అప్పీలేట్ అధికారి అయిన బ్యాంకు ఛైర్మన్కు రంగారెడ్డి మొదటి అప్పీలు చేశారు. అక్కడా తిరస్కారమే. దాంతో దరఖాస్తుదారు సీఐసీకి రెండో అప్పీలు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కమిషన్ జులై 14, 2009న కడప కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ సందర్భంగా దరఖాస్తుదారు, బ్యాంకు ఛైర్మన్, జీఎం వాదనలను కేంద్ర సమాచార కమిషనర్ సత్యేంద్ర మిశ్రా విన్నారు. దరఖాస్తుదారు కోరిన సమాచారం పూర్తిగా ప్రజాప్రయోజనానికి సంబంధించినదని,సెక్షన్ 8(1)(జె) దీనికి వర్తించదని ఆయన తీర్పు చెప్పారు. తీర్పు ప్రతులు అందిన పది రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అయినా.. బ్యాంక్ ఛైర్మన్ పొంతన లేని సమాధానాన్నే పంపారు.'జరిగిన నిధుల దుర్వినియోగంలో అధికారుల పాత్ర బయటపడుతుందనే.. సమాచారం ఇవ్వట్లేదు. కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించినా పూర్తి సమాచారం ఇవ్వలేదు. దీనిపై మళ్లీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాను'. అని దరఖాస్తుదారు చెప్పారు.
- డి.శ్రీనివాసులు, దేవుని కడప |
|