| ఎక్స్రే ప్లాంట్లు ఉన్నా లేనట్టే ! |
| ప్రచురణ తేది: 31/08/2009 |
|
* జిల్లాలో రోగులకు తప్పని అవస్థలు
వెంకటగిరి -వాకాడు, న్యూస్టుడే : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్స్రే ప్లాంట్లు పనిచేయడం లేదు. ఏళ్ల తరబడి మరమ్మతులు జరగక కొన్ని, సిబ్బంది లేక మరికొన్ని నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. దీంతో చిన్న, చిన్న చికిత్సలకు కూడా ఎక్స్రే వసతి లేదనే మిషతో రోగులను ఆయా ఆస్పత్రుల సిబ్బంది పట్టణాలకు పంపేస్తున్నారు. ఈ కారణంగా మండల కేంద్రాలు లేదా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ ఆస్పత్రులున్నా వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని వివిధ మండలాల ప్రజలు వాపోతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి వైద్య, ఆరోగ్యశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
పదిచోట్ల వృథాగా.. జిల్లాలో 12 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్స్రే ప్లాంట్లు ఉండగా అందులో 10 చోట్ల నిరుపయోగంగా మారాయి. వెంకటగిరిలోని ప్లాంటు మూలపడి దాదాపు పదేళ్లయినా ఇప్పటికీ మరమ్మతు చేయలేదు. దీంతోఇక్కడ రేడియోగ్రాఫర్ ఉన్నా ఎక్స్రే గది మాత్రం ఎప్పుడూ మూసి ఉంటుంది. వాకాడు, బాలిరెడ్డిపాళెం, కోట, నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఎక్స్రే ప్లాంట్లు కూడా వృథాగా పడి ఉన్నాయి. వాకాడులో రేడియోగ్రాఫర్ లేక ఉపయోగపడటం లేదు. మిగతా అన్నిచోట్ల ఈ తరహా సమస్యలతో ఎక్స్రే సదుపాయం లేని ఆస్పత్రులుగా మారిపోయాయి.
వాస్తవానికి జిల్లాలో 66 ప్రాథమిక, ఏడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా 12 చోట్ల మాత్రమే అందుబాటులోకి తెచ్చిన ఎక్స్రేప్లాంట్లు ప్రజలకు ఉపయోగపడనందువల్ల వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రత్యేకించి వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికో లీగల్ కేసుల్లో కూడా ప్రథమ చికిత్స జరిపి క్షతగాత్రులను తిరుపతికి వెళ్లమంటున్నారు. ఈ పరిస్థితి నిరుపేదలను అవస్థల పాల్జేస్తోంది. ఇప్పటికైనా ఎక్స్రే ప్లాంట్లన్నీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం : చంద్రశేఖర్రెడ్డి, జిల్లా వైద్యాధికారి జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్స్రేప్లాంట్లు వినియోగంలో లేవు. సిబ్బంది కొరత, మరమ్మతులు జరగక ఈ పరిస్థితి ఏర్పడింది. వాటిని చక్కదిద్దడానికి అవసరమైన చర్యలపై వైద్యశాఖ సంచాలకులకు ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటాం. |
|