| వద్దు 'మహా'ప్రభో |
| ప్రచురణ తేది: 12/10/2009 |
|
గ్రేటర్లో విలీనానికి 30 పంచాయతీలు ససేమిరా ఉపాధి, పన్నులే కారణం
కలెక్టరేట్ , న్యూస్టుడే: ప్రభుత్వం ఒక వైపు వరంగల్ నగరాన్ని గ్రేటర్గా మార్చడానికి రంగం సిద్ధం చేస్తుంటే.. శివారు గ్రామాలు మాత్రం విలీనానికి విముఖత వ్యక్తం చేస్తున్నాయి. నగరానికి చుట్టుపక్కల ఉన్న 44 గ్రామాలను కార్పొరేషన్లో కలపాలని బల్దియా పాలకవర్గం ఇప్పటికే తీర్మానించి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. 10 లక్షల జనాభా దాటితే నగరాన్ని నర్మ్ పథకంలో చేర్చి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టవచ్చన్న ఏకైక కారణంతోనే ఇన్ని గ్రామాలను కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు. అయితే తమ గ్రామాలను కార్పొరేషన్లో చేర్చడం వల్ల ఉపాధి హామీ పథకం వర్తించదని, స్థానిక ప్రజాప్రతినిధులు అభ్యంతరం చెబుతున్నారు. రాజకీయంగా పదుల సంఖ్యలో పదవులు కోల్పోవడంతో పాటు, ప్రజలపై భారీగా పన్నుల భారం పడుతుందన్నది వారి వాదన. ఈ క్రమంలో ఇప్పటికే 32 గ్రామాల ప్రజాప్రతినిధులు విలీనానికి తిరస్కరించారు. కేవలం 12 గ్రామ పంచాయతీలు మాత్రమే విలీనానికి సానుకూలంగా ఆమోదం తెలిపాయి.
నర్మ్ వస్తేనే ప్రగతి ప్రతిపాదిత 44 గ్రామాల విలీనం వల్ల నగర జనాభా 10.5 లక్షలు దాటనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (నర్మ్) కింద వరంగల్కు భారీగా నిధులు వస్తాయి. 'నర్మ్' గ్రూపు-1లో చేర్చితే సుమారు రూ.750 కోట్ల నుంచి రూ.1200 కోట్ల వరకు, గ్రూపు-2లో చేర్చితే రూ.500 కోట్ల నుంచి రూ.750 కోట్ల వరకు నిధులు వస్తాయి. అయితే ఈ నిధులను చిన్నచిన్న అవసరాలకు వెచ్చించకూడదు. భారీ పనులే చేయాల్సి ఉంటుంది. అంటే కుడా మాస్టర్ ప్లాన్ ప్రకారం 2010లో అమలు చేయనున్న ప్రధాన రోడ్ల విస్తరణకు నిధులు వస్తాయి. శివారు గ్రామాలను కలుపుతూ కొత్తగా రోడ్లు వేయొచ్చు. ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న రింగురోడ్డు కల సాకారం కావొచ్చు. 100, 200 అడుగుల అంతర్గత రహదారులకు ఇబ్బందులు తొలుగుతాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థను నిర్మించవచ్చు. అయితే ఈ విషయాలపై విలీనాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామాల ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అంగీకరించిన పంచాయతీలు ఇవీ గ్రేటర్లో విలీనానికి అంగీకరించిన 12 గ్రామాల్లో హన్మకొండ మండలంలోని అల్లిపూర్, అయోధ్యపురం, భట్టుపల్లి, కడిపికొండ, కుమ్మరిగూడెం, పైడిపల్లి, హసన్పర్తి మండలంలోని చింతగట్టు, పెగడపల్లి, ఎల్లాపూర్, గీసుకొండ మండలంలోని మొగిలిచర్ల, ధర్మసాగర్ మండలంలోని రాంపూర్ ఉన్నాయి. కాగా హసన్పర్తి మండలంలోని వంగపహాడ్ పంచాయతీ పాలకపక్షం పదవి కాలం పూర్తవడానికి మరో రెండు సంవత్సరాలు సమయం ఉన్నందున ఆ తర్వాతే విలీనానికి అభ్యంతరం లేదని తీర్మానించారు.
నిరాకరించినవి : గ్రేటర్ కార్పొరేషన్లో విలీనానికి నిరాకరించిన 30 గ్రామ పంచాయతీలలో హన్మకొండ మండలం పరిధిలో 13, హసన్పర్తి మండలంలో 6, గీసుకొండ పరిధిలో 7, సంగెం మండల పరిధిలో 2, వర్ధన్నపేట, ధర్మసాగర్ మండలాలలో ఒక్కో పంచాయతీలు ఉన్నాయి.
నివేదిక యథాతథంగా పంపాం - డీపీవో సురేష్బాబు గ్రేటర్ కార్పొరేషన్లో విలీనానికి సంబంధించి ఎంపిక చేసిన 42 పంచాయతీలలో 12 అంగీకరించాయి. 30 మాత్రం వద్దంటూ తీర్మానాలు అందజేశాయి. వారి అభిప్రాయాల నివేదిక యథాతథంగా ప్రభుత్వానికి పంపాం. ఉపాధి హామీ పథకం వర్తించదనే కారణంగానే ఎక్కువ పంచాయతీలు విలీనానికి నిరాకరిస్తున్నాయి. |
|