| బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ |
| ప్రచురణ తేది: 15/09/2009 |
|
దు రుద్దేశంతో సమాచారం అడిగారన్నారు.. సంతకాల్లో తేడాలున్నాయి, సమాచారం ఇవ్వమన్నారు.. 4(1)(బి) సమాచారానికి కూడా సెక్షన్ 8(1)(డి)ని అన్వయించారు.. చివరికి కమిషన్ సమాచారం ఇవ్వమన్నా రూ.2000 కడితేనే ఇస్తామన్నారు.. అదీ దరఖాస్తు చేసిన 14 నెలలకు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయ అధికారుల ఘనతిది. వ్యాట్ అమల్లోకి రాక ముందు డిపాజిట్ బాండ్లను సమర్పించిన వారి వివరాలను కోరుతూ నెల్లూరుకు చెందిన రమేష్బాబు కావలి వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి జూన్ 4, 2008న దరఖాస్తు చేశారు. 4(1)(బి) సమాచారాన్ని అడిగారు. జూన్ 24, 2008న అధికారులు సమాధానమిస్తూ 'మీరు అడిగిన సమాచారం థర్డ్పార్టీది. దాన్ని ఇవ్వకూడదు. దరఖాస్తులో మీరు చేసిన సంతకానికి.. మేమిచ్చిన రసీదు తీసుకున్నప్పుడు చేసిన దానికిి తేడా ఉన్నందున దురుద్దేశంతో సమాచారం అడిగారని భావించాల్సి వస్తోంది. 4(1)(బి) సమాచారాన్ని సెక్షన్ 8(1)(డి) ప్రకారం ఇవ్వరాదు' అని చెప్పారు. మొదటి అప్పీలు చేసినా ఫలితం లేదు. రమేష్ కమిషన్కు వెళ్లడంతో 'ఎలాంటి మినహాయింపులు వర్తించవు. 30 రోజుల్లోగా సమాచారమివ్వాలి' అని తీర్పు వచ్చింది. దాంతో ఏప్రిల్ 18, 2009న పీఐవో లేఖ పంపిస్తూ 'రూ.2 వేలు కడితే సమాచారం ఇస్తాం' అన్నారు. గడువు దాటినా రుసుం అడిగారంటూ రమేష్ కమిషన్కు మళ్లీ ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషన్ సమాచారం ఇప్పించాలంటూ హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, నెల్లూరు జిల్లా కలెక్టర్లకు లేఖ రాసింది. అయినా.. 'రూ.2 వేలు కడితేనే సమాచారం ఇస్తాం' అంటూ ఆగస్టు 26, 2009న కావలి కార్యాలయ పీఐవో లేఖ రాశారు. ఇప్పటికైనా కమిషన్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. |
|