| సమర్థులే.. కమిషనర్లవ్వాలి |
| ప్రచురణ తేది: 26/10/2009 |
|
చట్టానికి ప్రచారమేది? ఆంధ్రప్రదేశ్లో అమలు అధ్వానం 'ఈనాడు ముందడుగు'తో మనీష్
స మాచార హక్కు చట్టాన్ని బాగా అమలు చేయాలని ప్రధానమంత్రి చెబుతోన్న మాటలను ఆయన కార్యాలయమే పట్టించుకోవట్లేదని ప్రముఖ సహ ఉద్యమకారుడు, 'కబీర్' వ్యవస్థాపకులు మనీష్ శిశోడియా విమర్శించారు. చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లయినా.. 'సమాచార స్వేచ్ఛ' పూర్తిగా అందుబాటులోకి రాలేదన్నారు. మీడియా, ఉద్యమకారులతో పాటు ప్రభుత్వాలూ కృషి చేస్తేనే చట్టం గ్రామస్థాయికి వెళుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో సహ చట్టం అమలు.. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయన 'ఈనాడు ముందడుగు'తో మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం..
* సమాచార హక్కు చట్టం మౌలిక ఉద్దేశం ఇప్పుడిప్పుడే నెరవేరుతోంది. లక్ష్యాన్ని పూర్తిగా చేరడానికి మరింత సమయం పడుతుంది. చట్టానికి విస్తృత ప్రచారం కల్పిస్తేనే ఇది సాధ్యం.
* చట్టాన్ని బాగా అమలు చేయాలన్న ప్రధాని సూచనను ప్రభుత్వ యంత్రాంగాలు పాటించడం లేదు. ఆయన కార్యాలయంలోనే 'సూచన'లు అమలు కావట్లేదు. ముందు తన కార్యాలయంలో సహ చట్టం అమలు తీరును ప్రధాని సమీక్షించాలి.
* ఏ రాష్ట్రంలోనూ చెప్పుకోదగిన స్థాయిలో చట్టం అమలు కావట్లేదు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో మాత్రం పరిస్థితి బాగుంది. సంబంధిత శాఖలను చూస్తున్న కేంద్ర/ రాష్ట్ర సమాచార కమిషనర్ను బట్టి అమలు తీరు ఆధారపడి ఉంటోంది. బీహార్లో దరఖాస్తు విధానం కాస్త మెరుగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరీ అధ్వానం.
* చట్టం వచ్చి నాలుగేళ్లయినా.. సమాచారం కోసం ఇంకా అధికారుల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితే. చట్టంలో పేర్కొన్నట్లు సులభంగా సమాచారం అందడం లేదు. అధికారుల నుంచి స్వేచ్ఛగా.. సకాలంలో దరఖాస్తుదారులు సమాచారం పొందగలిగినపుడే సహ చట్టం లక్ష్యం నెరవేరినట్టు.
* సమాచారం ఇవ్వడానికి ఉన్న గడువు తగ్గించాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో 48 గంటల్లోగా సమాచారం పొందే హక్కు ఎలాగూ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది.
* సమాచార కమిషనర్ల నియామక కమిటీలో ఇప్పటికిప్పుడే మార్పులు రావడం కష్టం. భవిష్యత్తులో జరగొచ్చు. వాస్తవానికి సహ ఉద్యమకారులు కోరుతుందల్లా.. సమర్థులను కమిషనర్లగా నియమించాలనే.
* సమాచార కమిషనర్లుగా ఉన్న చాలా మంది విశ్రాంత ఐఏఎస్ అధికారులు.. సహ చట్టాన్ని సక్రమంగా విశ్లేషించగలిగిన వారే. తమ అనుభవం ఆధారంగా చాలా వేగంగా తీర్పులిచ్చే అవకాశం వారికి ఉంది. అయితే.. రాజకీయం, ఇతరత్రా కారణాల వల్ల సమాచార కమిషనర్లు పూర్తిస్థాయిలో పని చేయలేకపోతున్నారు.
* పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సహ చట్టానికి మంచి ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఉద్యమకారులూ తీవ్రంగానే కృషి చేస్తున్నారు. అయితే.. వీరికి తోడుగా ప్రభుత్వమూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. - బి.వేణుగోపాల్, న్యూస్టుడే, న్యూఢిల్లీ |
|