| కైంకర్యం |
| ప్రచురణ తేది: 13/10/2009 |
|
* అక్రమంగా నిధుల మళ్లింపు * తప్పులు తడకగా జాబితాలు * 'ఈనాడు - ముందడుగు'తో బట్టబయలు
శ్రీకాకుళం , గ్రామీణ సారవకోట: నరసన్నపేట పంచాయతీరాజ్ సబ్ డివిజన్ చిత్రవిచిత్రాల సమాహారంగా మారింది. కేటాయించిన నిధులకు.. చూపిన పనులకు పొంతన కుదరడం లేదు. అసలు జాబితాల్లో లేని వాటి పేరు మీద లెక్కలు చూపిస్తూ చాకచాక్యంగా నిధులు మళ్లిస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన నియమావళికే వక్రభాష్యం చెబుతున్న 'పెద్దల' బండారం 'ఈనాడు-ముందడుగు'తో బయటపడింది.
సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సారవకోట, నరసన్నపేట, జలుమూరు, పోలాకి మండలాల్లో 2008-09 ఆర్థిక సంవత్సరానికి రూ.79.25లక్షల నిధులు కేటాయించారు. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ద్వారా జరిగిన ఆ పనుల్లో అత్యధిక భాగం మరమ్మతులు, ఆర్ఆర్ఎం రహదారులు, సీసీరోడ్లకు వెచ్చించారు. కేటాయించిన నిధులతో గుత్తేదారులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. నిబంధనలు ఒప్పుకోవని చెప్పినా అధికారుల మాటల్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. మొత్తం కేటాయించిన పనులు, ఖర్చయిన నిధుల వివరాల్ని 'ఈనాడు-ముందడుగు' ప్రతినిధి సమాచార హక్కు చట్టం ఉపయోగించి తీసుకుంటే అంతులేని అక్రమాలు బయటపడ్డాయి. ప్రధానంగా సారవకోట మండలంలో మంజూరుచేసిన పనులు ఒకచోటంటే.. ఖర్చు చూపుతోంది మరోచోట అని అధికారులే సెలవిస్తున్నారు.
నిధుల మళ్లింపులో మతలబు సారవకోట మండలంలోని జిల్లా పరిషత్తు నిధుల నుంచి గుమ్మపాడు-అశోకం వరకు గ్రావెల్, మెటల్ రోడ్డు నిర్మించామని రికార్డుల్లో చూపించారు. గుమ్మపాడుకు చెందిన పి.దాసన్న అనే వ్యక్తి గుత్తేదారుగా వ్యవహరించి రూ.4.81 లక్షలు ఖర్చుచేసినట్లు చూపుతున్నారు. రికార్డుల్లో పదిలంగా ఉన్న రోడ్డు వాస్తవంగా ఎక్కడా కనిపించడంలేదు.
అసలు నిర్మాణమే జరగకుండా నిధులు ఖర్చుచేసినట్లు చూపారు. ఈ విషయంపై డీఈ లావణ్య కుమార్ను 'న్యూస్టుడే' వివరణ కోరినప్పుడు ఆ నిధులు సమీపంలో రక్షణ గోడ నిర్మాణానికి వెచ్చించామన్నారు. రికార్డుల్లో రోడ్డు నిర్మాణానికి ఎందుకు చూపారంటే సమాధానం చెప్పలేకపోయారు. అక్కడ సమీపంలో ఒక నేతకు సంబంధించిన గ్రానైట్ క్వారీ ఉంది. వాహనాల రాకపోకలకు సులభంగా ఉంటుందని నిధులు మళ్లించి రక్షణ గోడ నిర్మించారన్న ఆరోపణలున్నాయి.
సారవకోట మండల ప్రజా పరిషత్తు కార్యాలయం ప్రత్యేక మరమ్మతులకు రూ.1.54 లక్షలు, మండల పరిషత్తు సమావేశ మందిరం మరమ్మతులకు రూ.25వేలు ఖర్చు చూపారు. అసంపూర్తిగా ఉన్న సామాజిక భవనం పూర్తి చేయడానికి రూ.4.95లక్షలుగా పేర్కొన్నారు. వాస్తవంగా ఎక్కడా సామాజిక భవన నిర్మాణం జరగడంలేదు. దీనిపై మండల ఇంజినీరింగ్ అధికారి బాలాజీని 'న్యూస్టుడే' వివరణ కోరితే ఆ నిధులు సమావేశ మందిర నిర్మాణానికి ఖర్చుచేశామని తెలిపారు. దీనివల్ల సామాజిక భవనం భవిష్యత్తులో నిర్మించే అవకాశం లేకుండాపోయింది. ఎందుకలా చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే కొన్ని సాంకేతిక కారణాలని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయించిన పనికి సంబంధించిన నిధులు వేరే పనికి మళ్లించడానికి 25శాతం మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో నిధుల్ని మళ్లించారు. ఇక బద్రి నుంచి మర్రివలస రహదారి నిర్మాణానికి రూ.2లక్షలు కేటాయించారు. ఈ గ్రామానికి చెందిన మెండ సుందరరావు గుత్తేదారుగా వ్యవహరించారు. సంవత్సరం పూర్తి కాకుండానే రహదారి పూర్తి ఆనవాళ్లు కొల్పోయింది. |
|