| అక్రమాల భరతం పట్టారు.. |
| ప్రచురణ తేది: 12/10/2009 |
|
కొల్లాపూర్ , న్యూస్టుడే: సమాచార హక్కు చట్టంతో అక్రమాల అంతు తేల్చారు. 'ఈనాడు' పత్రికలో చట్టం గురించి తెలుసుకొని తమ పరిధిలో జరిగిన అవినీతిని వెలికితీశారు. న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు..
ఇందిరమ్మ ఇళ్ల అవినీతి పాన్గల్ మండలంలోని గోప్లాపూర్లో గత 2007-08లో ఇందిరమ్మ ఇళ్లలో పెద్దఎత్తున అవినీతి జరిగింది. కొంత మంది కూటమిగా ఏర్పడి రూ.లక్షల్లో కొల్లగొట్టారు. విషయం తెలిసి పాన్గల్కు చెందిన తెదేపా నేత రామేశ్వర్రెడ్డి సమాచార హక్కు చట్టంతో గృహ నిర్మాణ అధికారులకు వివరాల కోసం దరఖాస్తు చేశారు. మంజూరైన ఇళ్ల జాబితాతో లబ్ధిదారుల వద్దకెళ్లి వివరాలు సేకరించారు.. అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారికంగా రూ.26 లక్షలు, అనధికారికంగా రూ.50 లక్షల వరకు స్వాహా అయినట్లు తేలింది. పోలీసులు బాధ్యులైన గోప్లాపూర్ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యురాలి భర్తను అరెస్టు చేసి జైలుకు పంపారు. గ్రామస్థుల సహకారం, స.హ.చట్టంతో అక్రమాలను వెలుగులోకి తెచ్చినట్లు రామేశ్వర్రెడ్డి చెప్పారు.
ఉపాధి అక్రమాలు వెలుగులోకి.. వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో రైతు ఆకులమోని బాబుకు చెందిన నాలుగెకరాల పొలంలో గత 2008లో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు జరుగకున్నా జరిగినట్లు రూ.21 వేలు స్వాహా చేశారు. ఈ రైతు కూడా పనులు చేసినట్లు మస్టర్లు రాసుకొని డబ్బు ఎత్తుకున్నారు. ఈ విషయం రైతుకు తెలిసింది. చదువు రాకున్నా 'ఈనాడు' దిన పత్రికలో సమాచార హక్కు చట్టం గురించి వేరేవారి ద్వారా తెలుసుకున్నారు. సంబంధిత ఎంపీడీఓ, తహసిల్దార్, పథకం ఏపీఓలకు సహ చట్టం ద్వారా వివరాలు కావాలని కోరారు. పనులు చేయకున్నా రూ.21 వేలు స్వాహా చేసినట్లు అధారాలతో ఉన్నతాధికారులకు రైతు బాబు ఫిర్యాదు చేశారు. నిర్ధారణ కావడంతో బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. రాజకీయంగా ఒత్తిళ్లు వచ్చినా తట్టుకున్నాడు. 'ఈనాడు' పత్రిక స్ఫూర్తితో సహ చట్టం ద్వారా అక్రమాలను వెలుగులోకి తెచ్చినట్లు రైతు బాబు చెప్పారు. |
|