| అవినీతి 'రికార్డు'పై విచారణ |
| ప్రచురణ తేది: 22/09/2009 |
|
* ఆదేశాలు జారీచేసిన కలెక్టర్ శ్రీకాంత్ * జె.సి. శ్రీధర్కు బాధ్యతలు * 'ఈనాడు' కథనానికి స్పందన
అ టవీహక్కుల చట్టం అమలు ముసుగులో జరిగిన అక్రమాలపై కలెక్టర్ శ్రీకాంత్ స్పందించారు. గత శుక్రవారం 'ఈనాడు'లో వచ్చిన అవినీతి 'రికార్డు' కథనం ఆధారంగా విచారణ చేయించాలని నిర్ణయించారు. జాయింట్ కలెక్టర్ (జె.సి.) శ్రీధర్కు విచారణ బాధ్యతలు అప్పగించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సోమవారం ఆదేశాలు జారీచేశారు.
న్యూస్టుడే , శ్రీకాకుళం సీతంపేట ఐటీడీఏ పరిధిలో జరిగిన అక్రమాలు బయటపడకుండా ఉన్నతాధికారుల కళ్లకు గంతలు పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటవీ హక్కుల చట్టం అమలు కోసం రూ.50 లక్షలు, గిరిజనులకు అటవీహక్కుల పత్రాల పంపిణీ చేయడానికి నిర్వహించిన గంట సేపు కార్యక్రమానికి రూ.17,26,678 ఖర్చు పెట్టినట్లు చూపారు. ప్రభుత్వం కేటాయించిన నిధులన్నీ పక్కదారి పట్టించారు. తాత్కాలిక ఉద్యోగుల పేరుతో రూ.లక్షల బయానాలు ఇచ్చారు.
12,565 మంది లబ్ధిదారులకు 25,322.63 ఎకరాలను పంపిణీ చేయడానికి కేటాయించిన రూ.67 లక్షల నిధుల్లో అడుగడుగునా అవినీతికి పాల్పడ్డారు. ఐటీడీఏలో జిరాక్స్ మిషన్లు ఉన్నప్పటికీ కేవలం జిరాక్స్ కాపీల కోసమే రూ.2,84,593 ఖర్చు చేశారు. కంప్యూటర్ సామగ్రి కోసం రూ.3,38,514, ఆపరేటర్ల వేతనాల కోసం రూ.5,44,726 ఖర్చులు చూపారు.
ఈ ఏడాది జూన్ 15వ తేదిన సీతంపేటలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన 728 గిరిజనులకు పులిహోర, మంచినీటి ప్యాకెట్ అందించేందుకు రూ.7,280 ఖర్చుచూపిన ఐటీడీఏ అధికారులు స్వల్పంగా హాజరైన ప్రజాప్రతినిధుల భోజనాలకు రూ.2,62,265 ఖర్చుచేసినట్లు దొంగలెక్కలు చూపారు. గంటసేపు వేసిన షామియానాకు రూ.5,66,984 అద్దె చెల్లించినట్లు చూపారు. వాస్తవంగా బహిరంగ మార్కెట్లో షామియానా కొనుగోలు చేయాలంటే రూ.వేలల్లో మాత్రమే ఉంటుంది.
ఒకటి , రెండు గంటలకు అలంకరణ, అదనపు హంగులు పేరుతో అంతా భారీఎత్తున ఖర్చు చేయడం వెనక ఆంతర్యం ఏమిటన్నది అధికార వర్గాల్లోనే అంతుబట్టడం లేదు. ఐటీడీఏ పీవో సత్యవాది ఎటువంటి విచారణ చేపట్టకుండానే తమ సిబ్బందిని వెనకేసుకురావడం.. ఉన్నతాధికారుల అనుమతితోనే నిధులు ఖర్చుపెట్టామని బలంగా చెబుతున్నారు. దీనిపై కలెక్టర్ శ్రీకాంత్ స్పందించి జాయింట్ కలెక్టర్నే విచారణకు నియమించడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. |
|