| సమాచారశాఖలో పాండవులు |
| ప్రచురణ తేది: 04/10/2009 |
|
* ఉద్యోగపర్వంలో అజ్ఞాతవాసం * రెండున్నరేళ్లుగా విధులకు డుమ్మా * 'ఈనాడు-ముందడుగు'తో వెలుగులోకి
నెల్లూరు , న్యూస్టుడే: ఓవైపు.. చేసేందుకు పని దొరక్క లక్షలాది నిరుద్యోగులు జీవనపోరాటం చేస్తుంటే.. మరోవైపు పని చేయమని ఉద్యోగమిచ్చి వేలకు వేల రూపాయల జీతాలు ఇస్తున్నా వారికి విధులు నిర్వహించడానికి సమయం చిక్కడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కదా.. ఎలా చేస్తే ఏముందీ? అడిగేవారెవరు?.. ఇదీ వారి ధీమా. ఈ విధంగా నెలలు కాదు ఏకంగా ఏళ్లతరబడే విధులకు గైర్హాజరైనా పట్టించుకునేవారు ఉండటం లేదు. ఉద్యోగం మాత్రం నిక్షేపంగా ఉంటోంది. గైర్హాజరైనవారు సొంత వ్యాపారాలు చూసుకుంటుంటారు. కాస్త మార్పు కావాలనుకున్నపుడల్లా పైరవీలు చేయించుకొని మళ్లీ విధుల్లో చేరిపోతారు. జిల్లా పౌరసమాచార శాఖలో సాగుతున్న అయిదుగురు ఉద్యోగుల తంతు ఇది.
* ఒకరూ ఇద్దరు కాదు.. ఏకంగా అయిదుగురు ఉద్యోగులు గత రెండున్నరేళ్లుగా విధులకు గైర్హాజరవుతున్నా జిల్లా పౌరసమాచార శాఖ కిమ్మనడం లేదు. ఈ శాఖలో సుమారు 30 మంది ఉద్యోగులున్నారు. వారిలో అయిదుగురు విధులకు హాజరుకావడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి గైర్హాజరైతే గరిష్ఠంగా ఏడాదికాలం వరకు అతనికి నోటీసులు, ఛార్జిమెమోలు ఇవ్వడంతో సరిపెడతారు. ఆ తర్వాత కూడా విధులకు హాజరుకానిపక్షంలో ఉద్యోగబాధ్యతల నుంచి తొలగిస్తారు. రెండున్నరేళ్లుగా వీరు విధులకు హాజరుకాకపోయినా ఒక్కరిని కూడా విధుల నుంచి తొలగించకపోవడం గమనార్హం.
* గూడూరు పౌరసంబంధాల డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న టైపిస్టు 2007 జులై నుంచి విధులకు గైర్హాజరవుతున్నారు. ఇక్కడే పనిచేస్తున్న అటెండరు 2006 అక్టోబరు నుంచి రావడం లేదు.
* నెల్లూరు కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు అటెండర్లు 2007 జూన్ నుంచి ఒకరు, 2006 మే నుంచి మరొకరు, 2008 సెప్టెంబరు నుంచి ఇంకొకరు విధులకు గైర్హాజరవుతున్నారు.
* వీరంతా ఏడాది పరిమితిని దాటిపోయినవారే. నిబంధనల ప్రకారం అందరినీ ఉద్యోగబాధ్యతల నుంచి తొలగించాల్సి ఉంది. వీరిలో నెల్లూరులో అటెండరుగా పనిచేస్తున్న వ్యక్తి తాజాగా గత శుక్రవారం విధుల్లో చేరడం గమనార్హం. ఈయన 2007 జూన్ నుంచి విధులకు గైర్హాజరయ్యారు. అయినా అధికారులు పెద్దమనసు చేసుకొని స్వాగతం పలికారు. టైపిస్టు వేతనం సుమారు రూ.15 వేల వరకు ఉండగా, అటెండరు వేతనం రూ.10 వేల వరకు ఉంది. ఇంత పెద్దమొత్తంలో వేతనాలు ఇస్తూ కూడా ఉద్యోగులతో సరైన రీతిలో విధులు చేయించుకోలేని దుస్థితి.
ఇవీ లొసుగులు ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా గరిష్ఠంగా మెడికల్ లీవులు కానీ, సాధారణ సెలవులు కానీ ఆరు నెలలకు మించి ఉండవు. మెడికల్ లీవులను మినహాయిస్తే మిగిలినవాటిని ఏకమొత్తంగా వాడుకోవడం సాధ్యం కాదు. దీంతో ఆ ఉద్యోగి తీవ్ర అనార్యోగానికి గురైనపక్షంలో జీతంలో కోత విధించి సెలవులు కేటాయించే అవకాశం ఉంది. అయితే.. గైర్హాజరు విషయంలో ఇవేవీ వర్తించవు. 10 రోజులు ఎలాంటి సెలవుచీటీ ఇవ్వకుండా, ఉన్నతాధికారికి తెలియకుండా విధులకు గైర్హాజరైతే ఛార్జిమెమో ఇస్తారు. ఈ శాఖలో గైర్హాజరవుతున్న ఉద్యోగులు వీటన్నిటి నుంచి మినహాయింపు పొందుతున్నారు. పైరవీలు చేయించకొని నెలకో రెండు నెలలకో విధుల్లో చేరినట్లు రిజిస్టరులో నమోదు చేయించుకొని వేటు పడకుండా తప్పించుకుంటున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకొంటాం ఈ విషయమై జిల్లా పౌరసంబంధాల అధికారి జె.యు.కె.ప్రసాద్ 'న్యూస్టుడే'తో మాట్లాడుతూ.. ఆ సిబ్బంది విధులకు గైర్హాజరైన విషయం వాస్తవమేనని అంగీకరించారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. |
|