| ఏడాదిన్నరైనా.. ఏం లాభం! |
|

ప్రిన్సిపల్ కార్యదర్శి గారికి, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీకు సహ చట్టంపై అవగాహన ఉంటుందనుకున్నాం. మావన్నీ భ్రమలేనని తేలింది. సహ చట్టానికి తూట్లు పొడవటంలో గ్రామస్థాయి నుంచి సచివాలయం దాకా అందరూ పోటీ పడుతున్నారని అర్థమైంది. సమాచార రుసుంని కోర్టు ఫీ స్టాంపు రూపంలో కట్టకూడదన్న మీ 'సమాధానాన్ని' చూసి మాకు నోట మాట రావట్లేదు. మా వాళ్లలో ఒకరైన వరంగల్కు చెందిన న్యాయవాది కరుణాకర్ గతేడాది నవంబర్ 29న మీకో దరఖాస్తు చేశారు. నాలుగు అంశాలపై సమాచారం కోరారు. దరఖాస్తు రుసుం కింద కోర్టు ఫీ స్టాంపులు అతికించారు. దానికి మీరు ప్రజా సమాచార అధికారి హోదాలో డిసెంబరు 31, 2008న సమాధానం ఇచ్చారు. జీవో నంబరు 454 (13.10.05) ప్రకారం దరఖాస్తు రుసుంను నగదు, డీడీ, బ్యాంకర్స్ చెక్కు రూపాల్లో మాత్రమే కట్టాలని సెలవిస్తూ దరఖాస్తును తిరస్కరించారు. 454 జీవో గురించి మీరు చెప్పింది నిజమే. అయితే 01.10.07న రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.740ని కూడా జారీ చేసింది. దాని ప్రకారం కోర్టు ఫీ స్టాంపులను దరఖాస్తు రుసుంగా అంగీకరించాలి. ఈ జీవోను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో 01.07.08 నాడు యూవో నోట్ 20523ని కూడా ఇచ్చింది. కోర్టు ఫీ స్టాంపు తీసుకోమని చెప్పే జీవో వచ్చి ఏడాది.. యూవో నోట్ వచ్చి ఆర్నెల్లు దాటింది. ప్రిన్సిపల్ కార్యదర్శి అయిన మీకు ఆ సంగతి తెలియకపోవడం సహ చట్టం చేసుకున్న దురదృష్టం. ఐఏఎస్ అధికారులుగా చట్టం అమలుపై మీకున్న 'ప్రేమేంటో' దీంతో బోధపడింది. అయినా.. దరఖాస్తులు చేయకుండా ఉండలేం. మీరే ఒకసారి తీరిక చేసుకుని జీవో నం.740ని చూడాలని కోరుతున్నాం. యథా రాజా తథా ప్రజా చందాన మీ కింది అధికారులూ ఇలాగే చేస్తే చట్టం చట్టుబండలవుతుంది. దయతో చిత్తగించగలరు.
మీ రాష్ట్రవ్యాప్త సహ దరఖాస్తుదారులు |