‘‘చట్టానికి ఎవరూ అతీతులు కారు… చట్టం దృష్టిలో అందరూ సమానమే... చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ ఇవి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చెప్పిన మాటలు. మిగతా చట్టాలు ఎలా ఉన్నా సమాచార హక్కు చట్టానికి మాత్రం ఆయన వ్యాఖ్యలు అతికినట్టు సరిపోతాయి. ఓ ప్రజాప్రతినిధికి లభించే సమాచారాన్నీ ప్రతి పౌరుడూ పొందగలిగే అవకాశం కల్పించిందీ చట్టం. సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు ఈ చట్టాన్ని సాధించి సామాన్యులకు ఓ మహోపకారాన్ని చేశారు. అంతేకాదు.. అక్రమార్కుల పాలిట ‘తుపాకీ గుండు’ ఈ సమాచార హక్కు చట్టం.
సమాచార చట్టం.. సామాన్యుల చుట్టం..
‘‘ప్రభుత్వం చేత పని చేయించుకోవడం ప్రజల హక్కు, ఆ హక్కును డబ్బుతో కొనాలనుకోవడం సహించరాని నేరం’’
ఇవి ఓ సినిమాలో ముగింపు పలుకులు. ప్రజల నైతిక బాధ్యతను గుర్తుచేసే ఈ తరహా సంభాషణలు వింటూ ఉంటే ఒళ్లు పులకరిస్తుంది. సమస్కాపరిష్కారం సాధించి గెలుపొందిన సగటు మనిషిని సాటివారు ఉన్నతంగా ఊహించుకుంటారు. ఆ విజయం మరో పదిమందిలో చైతన్యస్ఫూర్తిని రగిలిస్తుంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరు దశాబ్దాల తరువాత ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నించే హక్కు సమాచార హక్కు చట్టం, 2005 ద్వారా దేశ పౌరులందరికీ లభించింది. చట్టంలోని 8(1) జె నిబంధన ప్రకారం ఒక పార్లమెంట్ సభ్యునికి ప్రభుత్వాధికారులు ఇవ్వాల్సిన సమాచారం సాధారణ పౌరునికీ ఇవ్వాలి. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్కలు చెప్పాలి. రూపాయి రాక-పోకలకు సంబంధించిన లెక్కలను తెలుసుకునే హక్కు ప్రజలందరికీ ఉంది. పౌరులడిగే మిగిలిన ఏ సమాచారమైనా నిర్ణీత గడువులోగా ప్రభుత్వ శాఖలు ఇచ్చి తీరాల్సిందేనని చట్టం చెబుతోంది.
చట్టం తెచ్చిన మార్పులు
మనదేశంలో సమాచార హక్కు చట్టం విప్లవాత్మకమైన మార్పుల్ని తెచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది వ్యవహారశైలినే మార్చేస్తోంది. ఒక్కో దరఖాస్తు ఆయా శాఖల అవినీతిని ఎండగడుతోంది. కొన్ని దరఖాస్తులైతే వ్యవస్థ మూలాలను కుదిపేస్తున్నాయి. ఈ విషయంలో అధికారి, బంట్రోతు అనే స్థాయీ భేదం ఏ మాత్రం లేదు. అక్రమార్కుల అందరిలోనూ అదే దిగులు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
చట్టంలోని 4(1) (బి) నిబంధన ప్రకారం ఆయా కార్యాలయాల్లో సంబంధిత సిబ్బంది పేర్లు, హోదాలు, విధులు, నిధులు, రికార్డులు, లబ్ధిదారుల జాబితాలు వగైరా 16 అంశాలతో కూడిన సమాచారాన్ని అక్టోబర్ 12 నాటికి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. తమ శాఖల వెబ్ సైట్లలో పొందుపర్చాలి. సెక్షన్ 4(1) ప్రకారం స్థానిక అధికార భాష తెలుగులో సమాచారాన్ని ఉంచాలనేది చట్టం ఉద్దేశం. నేటికీ అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఈ సూత్రాన్ని పాటించటం లేదు.
ఎప్పటికప్పుడు చోటుచేసుకునే మార్పులను అందులో చేర్చాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలోనూ సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను.. ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి. ఇప్పటికీ ఈ విషయంలో చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు విఫలమౌతునే ఉన్నాయి.
ప్రభుత్వ యంత్రాంగాలు ముందుగా చట్టాలను గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడే వారికి ప్రజా గౌరవం లభిస్తుంది. ఈ పరస్పర గౌరవమే భారతదేశం శక్తిమంతమైన ప్రజాస్వామ్యంగా అవతరించేందుకు నాంది.
- రాజహంస, విశాఖపట్నం |