సమాచారం ఎవరివ్వాలి
గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమాచార అధికారులను నియమించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వీరిని ‘కేంద్ర ప్రజా సమాచార అధికారు’లని పిలుస్తారు. దరఖాస్తుదారుకు అవసరమైన సహాయమూ అందిస్తారు. వీరితో పాటు ‘సహాయ ప్రజా సమాచార అధికారులనూ నియమించారు. ప్రతి కార్యాలయం ఎదుట వీరి పేర్లను బోర్డుపై ప్రదర్శించాలి. వారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం అమలు బాధ్యత వీరిదే.
ప్రజా సమాచార అధికారులు వీరే
గ్రామ పంచాయితీ .................................................... పంచాయితీ కార్యదర్శి
మండల ప్రజా పరిషత్ ............................................ కార్యనిర్వహక అధికారి
జిల్లా ప్రజా పరిషత్ ................................................... డిప్యూటీ సీఈఓ
తహశీల్ (మండల రెవెన్యూ కార్యాలయం) ...... తహశీల్దార్
డివిజనల్ రెవెన్యూ కార్యాలయం ........................ ఆర్డీఓ
జిల్లా కలెక్టర్ కార్యాలయం ..................................... డిఆర్ఓ
పురపాలక సంఘం ................................................... మేనేజరు
ప్రజా సమాచార అధికారి ... ప్రజా సంక్షేమానికి సూత్రధారి
మాతృభాషలో చెప్పాలి
అర్థం కాని భాషలో సమాచారం ఇవ్వడం అసలు సమాచారం ఇవ్వకపోవడంతో సమానం. సమాచార హక్కు చట్టం ముఖ్యోద్దేశం ప్రజా సంస్థల పని తీరులో పారదర్శకత పెంచటం. అందుకు కచ్ఛితంగా పాలన వ్యవహారాలు స్థానిక మాతృభాషలో జరగాలి. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(4) ప్రకారం సమాచారాన్ని స్థానిక అధికార భాషలోనే ఇవ్వాలి. జై కుమార్ జైన్ వర్సెస్ ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ కేసులో మాతృభాషలో సమాచారం ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషను 13 జూన్, 2006న తీర్పు చెప్పింది. |