|
|
| 'మామూళ్లు' ఎందుకివ్వాలి? |
| ప్రచురణ తేది: 08/09/2009 |
|
సహ విజయాలు అవినీతిని అడ్డుకోవాలని అనుకుంటే సరిపోదు. ఆలోచన కావాలి. ఆచరణలో అక్కరకొచ్చే ఆయుధాన్ని సిద్ధం చేసుకోవాలి. గురి చూసి అక్రమార్కులపై పేల్చాలి. అప్పుడే 'నీతి' నిలబడుతుంది. సరిగ్గా ఇదే రీతిలో బెంగళూరు మహానగర పాలిక సంస్థలోని లంచావతారుల పని పట్టారు ఓ అపార్ట్మెంట్ వాసులు. సహ చట్ట వినియోగంతోనే.. వారు దాన్ని సాధించారు.
బెం గళూరు సర్జాపూర్ రోడ్డులోని సన్ సిటీ అపార్ట్మెంట్లో 250 మంది నివసిస్తున్నారు. వీరిలో వంద మంది పేరిట ఇంటి పట్టా మారాల్సి ఉంది. మహానగర పాలక సంస్థ నుంచి పట్టా పొందాలంటే (ఖాతా మార్పిడి) మామూలు విషయం కాదు. ఇంటి విస్తీర్ణాన్ని అనుసరించి ఒక్కో చదరపు అడుగుకు ప్రాంతాల వారీగా అధికారులు 'మామూలు' నిర్ణయిస్తారు. అది రూ.వంద నుంచి రూ.వెయ్యి దాకా ఉంటుంది. ఈ మొత్తాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులకు చెల్లిస్తేనే రెండు వారాల్లోపు ఖాతా మార్పిడి పత్రాలు చేతికి వస్తాయి. లేకపోతే నెలల తరబడి వాళ్ల చుట్టూ తిరిగినా ఎటువంటి ఫలితమూ ఉండదు.
దరఖాస్తు చేశారు.. ఏడాదిన్నర కిందట సన్సిటీ అపార్ట్మెంట్ వాసుల్లో వంద మందికి ఖాతా మార్పిడి సమస్య వచ్చింది. పట్టాలు కావాలంటే.. రూ.పాతిక, ముప్పయి వేలు 'ఇవ్వాలని' అధికారులు డిమాండ్ చేశారు. మామూళ్లిచ్చి పట్టాలు తీసుకోవడం ఇష్టం లేని విద్యాసాగర్, హర్షద్, సంజీవ సుమన్, రంజిత చిత్తరంజన్, దయానంద తదితరులు సమాచార హక్కు చట్టాన్ని ప్రయోగించారు. తమ పట్టాల గురించి అడుగుతూ మహానగర పాలిక కమిషనర్కు ఆర్నెల్ల కిందట దరఖాస్తు చేశారు. మొదట్లో అధికారుల స్పందన లేకున్నా.. పట్టు విడవకుండా ప్రయత్నించారు. తమ వినతులపై తీసుకున్న చర్యల నివేదికలను అడుగుతూ చివరి వరకు పోరాడారు. దాంతో దిగివచ్చిన అధికారులు.. చిల్లి గవ్వ అదనపు ఖర్చు లేకుండానే వారికి పట్టాలు ఇచ్చారు.
సాటివారికి సూచనలు సాధించినదానితో ఆగిపోకుండా తోటివారికి కూడా ఈ బృందం సాయపడుతోంది. ఖాతా మార్పిడికి అపార్ట్మెంట్ ఆవరణలోనే శిబిరాల్ని నిర్వహిస్తున్నారు. సహ చట్టంపై అవగాహన కల్పిస్తున్నారు. వీరి పోరాట ఫలితంగా 'మామూళ్లు' అడగకుండా మరో 150 మంది ఖాతా దరఖాస్తుల్ని అధికారులు ఆమోదించారు. త్వరలో వారందరికీ హక్కు బదిలీ పత్రాలు రానున్నాయి.
- కె.ఆదినారాయణ మూర్తి, న్యూస్టుడే, బెంగళూరు |
|