|
|
| ఇంకెన్నాళ్లీ దుస్థితి..? |
| ప్రచురణ తేది: 13/10/2009 |
|
తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చిందని మురిసిపోతున్నాం.. కేంద్రం నుంచి నిధులు వస్తాయి మన భాషను బాగా అభివృద్ధి చేసుకోవచ్చని పొంగిపోతున్నాం.. అయితే తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా పూర్తిగా వ్యయం కాలేదనే విషయాన్ని సమాచార హక్కు చట్టం వెలుగులోకి తెచ్చింది.
ప్ర భుత్వ యంత్రాంగం కార్యక్రమాలు, ఉత్తరప్రత్యుత్తరాలు అన్నీ.. ఇప్పటికీ ఆంగ్లంలోనే. ఎందుకీ పరిస్థితి? అధికార భాష అమలును పర్యవేక్షించాల్సిన అధికార భాషా సంఘం ఏం చేస్తోంది? తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి అసలు ఆ సంఘానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందా అంటే.. గత మూడేళ్ల నుంచి మాత్రమే ఇస్తోంది. మన రాష్ట్రంలో అధికార భాషా సంఘం 1974లో ఏర్పాటయితే.. 2006-07 సంవత్సరం నుంచి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. ఇది స్వయంగా అధికార భాషా సంఘం ఓ సహ దరఖాస్తుకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. గుంటూరుకు చెందిన ఒ.శ్రీహరి చేసిన దరఖాస్తుకు అధికార భాషా సంఘం ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఇందులోనే ఉన్న మరో దురదృష్టకర అంశమేమంటే.. ప్రభుత్వం ఇచ్చిన నిధులను అధికార భాషా సంఘం పూర్తిగా ఖర్చు చేయలేదు. గత మూడేళ్లకు సంబంధించిన కేటాయింపుల్లో సగానికన్నా తక్కువ నిధులను మాత్రమే సంఘం ఖర్చు చేసింది. ప్రచురణలు, తెలుగు వికాసం భాషోత్సవాలు, ప్రకటనలు, ప్రచారాలు, ఇతర ఖర్చుల రూపేణా ఈ మాత్రమైనా ఖర్చు చేశారు. మూడు దశాబ్దాల పాటు నిధులు రాలేదనుకుంటూ ఉంటే.. వచ్చిన నిధులను సైతం తెలుగు భాషాభివృద్ధికి వెచ్చించలేని దుస్థితిని ఏమనాలి? ఎలా అర్థం చేసుకోవాలి? 'తెలుగు'ను ఇంకెలా అభివృద్ధి చేసుకోవాలి? |
|