|
|
| 'దేవాదాయానికి' సహ కవచం |
| ప్రచురణ తేది: 15/09/2009 |
|
రూ .మూడు కోట్ల విలువ చేసే దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూమిని సహ చట్టం కాపాడింది. ప్రైవేట్ ఆస్తిగా భావించిన ప్రకాశం జిల్లా మార్టురు మండలం కోనంకిలోని 4.93 ఎకరాల భూమి స్థానిక ఆలయానిదని నిరూపించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆ భూమి విలువ సెంటు రూ.50 వేలకు పైనే. దాన్ని అమ్మడానికి కొందరు ప్రయత్నించడంపై గ్రామస్థుడు ఉప్పలపాటి కృపారావు గుంటూరులోని 'ఆసరా' సంస్థకు సమాచారం ఇచ్చారు. ఆ భూమికి సంబంధించిన ఆర్.ఎస్.ఆర్ని కోరుతూ మార్టూర్ తహశీల్దార్ కార్యాలయానికి 'ఆసరా' అధ్యక్షుడు జె. మల్లిఖార్జునరావు దరఖాస్తు చేశారు. ఆర్.ఎస్.ఆర్. వచ్చింది. దాని ప్రకారం.. కోనంకి గ్రామ సర్వే నెంబరు 106లో తూర్పున ఉప్పలపాటి కృపారావు, వగైరాలు, దక్షిణం హరిజనవాడ, పడమర హరిజనవాడ బజారు, ఉత్తరం ట్రావెలర్ బంగళా హద్దుల మధ్య ఉన్న 4.93 ఎకరాల భూమి ధర్మాదాయ ఛారిటబుల్ ఆస్తి అని తేలింది. దాంతో దాన్ని కాపాడాలంటూ దేవాదాయ శాఖ మంత్రితో పాటు ఎండోమెంట్ కమిషనర్ తదితరులను మల్లిఖార్జునరావు కోరారు. వెంటనే గుంటూరు దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ భ్రమరాంబ స్పందించారు. తమ శాఖకు చెందిన ఆ భూమికి సంబంధించి ఎలాంటి క్రయ విక్రయాలు జరపవద్దంటూ మార్టూరు సబ్రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలకు లేఖలు రాశారు. స్పందించిన సబ్రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు ఈ భూమికి సంబంధించి ఎటువంటి క్రయ విక్రయాలు చెల్లవని, కోనంకి సర్వే నెంబరు 106లోని 4.93 ఎకరాల భూమి దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినదంటూ తమ పుస్తకంలో రెడ్మార్కుతో రౌండ్ చేశారు. - బి.వి.సాంబశివరావు, అద్దంకి |
|