|
|
| బాధ్యతారాహిత్యానికి వాత |
| ప్రచురణ తేది: 13/10/2009 |
|
ఖమ్మం డీఎంఅండ్హెచ్వోకు జరిమానా
స హ చట్టాన్ని ధిక్కరించిన ఖమ్మం డీఎంఅండ్హెచ్వోకు రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా వాత పెట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకూ 2003-04 నుంచి 2008 మధ్యకాలంలో యంత్రాలు, వాహనాలు, జనరేటర్లు కొనుగోలు, డిస్ట్రిబ్యూటర్ల వివరాలను అడుగుతూ ఖమ్మానికి చెందిన వి.మహేష్కుమార్ డీఎంఅండ్హెచ్వో కార్యాలయానికి దరఖాస్తు చేశారు. నిర్దేశిత గడువులోగా సమాచారం రాలేదు. దాంతో మహేష్ ప్రథమ అప్పీలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర సమాచార కమిషన్ను ఆశ్రయించారు. దరఖాస్తు చేసి 8 నెలలు దాటినా సమాచారం ఇవ్వకపోవడంతో అధికారులకు షోకాజు నోటీసులువచ్చాయి. డీఎంఅండ్హెచ్వో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు విచారణానంతరం తేలడంతో ఆయనకు రూ.అయిదు వేల జరిమానా విధిస్తూ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సీడీ అర్హా తీర్పు ఇచ్చారు.మహేష్ చేసిన మరో దరఖాస్తు విషయంలోనూ డీఎంఅండ్హెచ్వో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదు. దానికి సంబంధించి కూడా ఆయనకు కమిషన్ రూ.అయిదు వేల జరిమానా విధించింది. దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్న పీఐవోలు చాలామంది ఉన్నారు. వారందిరి పట్లా కమిషన్ ఇలాగే వ్యవహరించాలని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు. - జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్టుడే, ఖమ్మం
' పశ్చిమ'లోనూ.. ఇదే! పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా గతంలో పని చేసిన పి.కృష్ణారావు.. సహ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో రాష్ట్ర కమిషన్ రూ.10 వేల జరిమానా విధించింది. వై.నరసింహారావు ఓ సమాచారం కోరుతూ జిల్లా గ్రంథాలయ సంస్థకు దరఖాస్తు చేశారు. దానికి అసంపూర్తి సమాచారం వచ్చింది. దానిపై దరఖాస్తుదారు ప్రథమ అప్పీలు చేశారు. సమాచారం ఇవ్వాలనే ఆదేశాలు వచ్చాయి. అయినా.. పీఐవో స్పందించలేదు. దాంతో నరసింహారావు రెండో అప్పీలు చేశారు. విచారణ నిర్వహించిన కమిషనర్ అంబటి సుబ్బారావు.. అప్పటి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కృష్ణారావు(ప్రస్తుతం విశాఖ)కు రూ.పది వేల జరిమానా విధించారు. |
|